Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నగరంలోని మురుగేష్పల్యలో ఓ యువతిని యువకుడు కత్తితో దాడి చేసి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లీలా పవిత్ర ఓ కంపెనీలో పని చేస్తున్నది. విధులు ముగించుకొని రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడే ఉన్న దినకర్ బాణాల (28) అనే యువకుడు కత్తితో పవిత్రపై దాదాపు 15 సార్లు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో విలవిల్లాడుతూ మృతి చెందింది.
ఈ తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. లీలా పవిత్ర ఎంఎస్సీ వరకు చదివింది. హెల్త్కేర్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రయివేట్ లిమిటెడ్స్లో ఉద్యోగం చేస్తున్నది. శ్రీకాకుళానికి చెందిన దినకర్ తోమలూరులోని హాస్టల్లో ఉంటూ ఓ హెల్త్ కేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. లీలా పవిత్ర, దినకర్ ఇద్దరు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
కొద్ది నెలల కొందట పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా ఇద్దరి కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ తర్వాత లీలా పవిత్ర దినకర్ను దూరం పెట్టింది. అలాగే పలుసార్లు దినకర్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్పందించ లేదు. దీంతో కక్ష్య పెంచుకున్న దినకర్ పక్కా ప్రణాళికతో పవిత్ర పని చేస్తున్న ఆఫీసు వద్ద వచ్చాడు. కార్యాలయం నుంచి బయటకు రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.