Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని తెలిపారు. అర్జునుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అటు, యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందిన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. నిజాయతీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు. ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్మృతిలో నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు.