Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది ఇబ్బంది కలిగించే ఘటనే. చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన టేబుల్పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్బీ)లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్స్ లిమిటెడ్ (కె అండ్ ఎస్డీఎల్) చైర్మన్ కూడా అయిన ఆయన తండ్రి తరపున ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నిజానికి డిమాండ్ చేసిన లంచం మొత్తం రూ. 81 లక్షలు కాగా, రూ. 40 లక్షలు తీసుకుంటూ ఆయన పట్టుబడినట్టు లోకాయుక్త తెలిపింది. ప్రశాంత్ గతంలో ఏసీబీ (ప్రస్తుతం ఉనికిలో లేదు) ఫైనాన్షియల్ అడ్వైజర్గానూ పనిచేశారు. ఏసీబీని మూసివేశాక దాని స్థానంలో లోకాయుక్త ఏర్పాటైంది. ఆ తర్వాత ఆయన లోకాయుక్తలో చేరేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ పట్టుబడిన కార్యాలయం నుంచి రూ. 1.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.