Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్ల నుంచి సేకరించి పుణెకు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ ‘వన్ కార్డ్’ నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్లను పొందారు. అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్, ఇమ్రాన్ హష్మీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖుల పేర్లు, వివరాలను మోసగాళ్లు ఉపయోగించుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) షహద్ర రోహిత్ మీనా తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని దానిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆమె తెలిపారు.
ఈ మోసం గురించి కంపెనీకి ఆలస్యంగా తెలిసింగి. అయితే మోసగాళ్లు ఈ కార్డులలో కొన్నింటిని రూ.21.32 లక్షల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అరెస్ట్ చేశారు.పునీత్, మొహమ్మద్ ఆసిఫ్, సునీల్ కుమార్, పంకజ్ మిషార్, విశ్వ భాస్కర్ శర్మ అనే ఐదుగురు నిందితులు చాలా అసాధారణమైన రీతిలో కంపెనీని మోసం చేయడానికి చాలా సమన్వయంతో వ్యవహరించారని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అరెస్ట్ చేసిన అనంతరం వారిని విచారించగా తమ ప్రత్యేక కార్యనిర్వహణ విధానాన్ని వెల్లడించారు. వారు గూగుల్ నుంచి ప్రముఖుల జీఎస్టీ వివరాలను పొందేవారని తెలిసింది.
జీఎస్టీఐన్ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్, తదుపరి 10 అంకెలు పాన్ అని వారికి బాగా తెలుసని నిందితులలో ఒకరు తెలిపారు. పూణెకు చెందిన ఎఫ్పీఎల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ వన్ కార్డ్ని జారీ చేస్తుంది. ఈ మోసగాళ్లు తమ పేర్లపై క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి పాన్, ఆధార్ నంబర్ వంటి వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా తమ యాప్ ద్వారా కంపెనీని సంప్రదించారని కంపెనీ ఆరోపించింది. కేసు విచారణ కొనసాగుతోంది.