Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లండన్
వారం రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఇటీవల లండన్ వెళ్లారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆయన బిగ్ డేటా, భారత్-చైనా సంబంధాలపైనా ప్రసంగాలు చేయనున్నారు. వారాంతంలో ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు.
ఈ తరుణంలో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై మాట్లాడుతూ నరేంద్రమోడీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్లోకి పెగాసస్ జొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లపైనా ఇలాగే నిగా పెట్టారు. దీనిపై కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు నాకు కాల్ చేసి మీరు ఫోన్లో మాట్లాడేప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ మాటలను రికార్డ్ చేస్తున్నాం అని హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా మేం ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఇక ప్రతిపక్షాలపైన కేసులు సరేసరి. క్రిమినల్ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా నాపైనా కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు.
అంతే కాకుండా భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని, దానిపై దాడి జరుగుతోందని అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి పార్లమెంట్, స్వేచ్ఛాయుత మీడియా, న్యాయవ్యవస్థ వంటి వాటిని నిర్బంధిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో పడుతోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.