Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతకుంట మండలం బండరిపల్లికి చెందిన వాకిటి భవాని (25).. దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన సమీప బంధువు యుగేందర్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల యుగేందర్ మరో యువతితో పెళ్లికి సిద్ధమవ్వగా భవాని వ్యతిరేకించింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో యుగేందర్ యువతితో తనకు సంబంధం లేదని చెప్పడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి భవాని మృతి చెందింది. యువతి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. మృతురాలి కళ్లను కుటుంబసభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.