Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి ఫిర్యాదు చేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ను దూషించిన వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఎంపీ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాంటూ ఏఐసీసీపై ఒత్తిడి పెంచేందుకు బడుగుబలహీన వర్గాల నాయకులంతా పార్టీ సీనియర్ నాయకులను కలవనున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్చేసి దూషించడం వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తనపై, తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీకి ఫిర్యాదు చేసినట్లు చెరుకు సుధాకర్ వెల్లడించారు. కోమటిరెడ్డిపై తాను ఏ రోజూ ఎలాంటి విమర్శలు చేయలేదని, ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. 'ఎంపీ మాటలు క్రిమినల్ ఆలోచనతో ఉన్నాయి. హాస్పిటల్ను పేల్చేస్తాం. వంద మంది తిరుగుతున్నారని చెబుతున్నారు. ఇది మేం సామాన్యంగా తీసుకోవడం లేదు' అని చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అందుబాటులో లేకపోవడంతో సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్రావుకు ఆయన నిన్న ఫిర్యాదు చేశారు.