Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విచారణకై ఢిల్లీకి రావాలంటూ ఈడీ, ఎమ్మెల్సీ కవితకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మంగళవారం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాను కవితకు బినామీనంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రిమాండ్ రిపోర్ట్లోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లైతో కలిపి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కూడా డిసెంబర్ 12వ తేదీన దాదాపు ఏడు గంటలు కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు. ఈ నెల 13వ తేదీ వరకు పిళ్లై, ఈడీ కస్టడీలోనే ఉండనున్నాడు. మరోవైపు ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకున్నారు.