Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు మహిళా జర్నలిస్టులను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. ప్రపంచ మహిళా సందర్భంగా ఆయన డీజీపీ కార్యాలయంలో మహిళా జర్నలిస్టులతో భేటీ అయ్యారు. అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, తరుణ్ జోషి, డీఐజీ రమేశ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పోలీస్శాఖలో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా మహిళల నియామకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. పురుష పోలీస్ అధికారులతో పోటీ పడి విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ అధికారులు అందిస్తున్న ఉత్తమ సేవలను మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించాలని పేర్కొన్నారు. తద్వారా యువతులకు స్ఫూర్తిదాయకంగా ఉండి పోలీస్ శాఖలో చేరడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు, జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల వర్కింగ్ విధానాలు, జెండర్ ఈక్వాలిటీ, వేధింపుల నిరోధానికి ఉన్న అంతర్గత కమిటీల పనితీరు తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్బంగా కోవిడ్ను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను తెలియ చేసే కాఫీ టేబుల్ బుక్ను జర్నలిస్టులకు డీజీపీ అంజనీ కుమార్ బహూకరించారు.