Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలి రెండు టెస్టులను భారత్ సొంతం చేసుకోగా, మూడో మ్యాచ్ను పర్యాటక జట్టు గెలుచుకుంది. దీంతో నేటి మ్యాచ్ కీలకంగా మారింది. అంతేకాదు, నేటి మ్యాచ్కు ఎంతో ప్రత్యేకత కూడా ఉంది. ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా మ్యాచ్ను వీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఇప్పటికే భారత్ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఆయన మ్యాచ్ను వీక్షిస్తారు. అంతే కాకుండా ఈ మ్యాచ్లో మోడీ టాస్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ టెస్టు భారత్కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ను కైవసం చేసుకుంటే భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడమే కాకుండా సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఈ తరుణంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ను వీక్షించేందుకు నేడు లక్షమంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రధాని రాకతో స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.