Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులను మరింత ఆకర్షించేందుకు, ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ సిటీ ప్రయాణికులకు సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. మహిళలకు, సీనియర్ సిటిజన్లకు టీ-6, ఫ్యామిలీకి టీ-24 పేరుతో కొత్త టికెట్లను శుక్రవారం నుంచి సిటీ బస్సుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన టీ-24 టికెట్కు విశేషమైన ఆదరణ లభిస్తున్నందున తాజాగా టీ-6, టీ-24 టికెట్లను ప్రవేశపెట్టినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఈ క్రమంలో బస్ భవన్లో ప్రత్యేక ఆఫర్ టికెట్లకు సంబంధించి ప్రచార పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళలు, సీనియర్ సిటిజన్లు (60ఏళ్ల పైబడిన) రూ.50 చెల్లించి టీ-6 టికెట్ తీసుకుని గ్రేటర్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. టికెట్ తీసుకునేందుకు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక వారాంతాలు, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా రూ.300తో ఫ్యామిలీ (నలుగురు) టీ-24 టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.