Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇది ఇద్దరమ్మాయిల ప్రేమ కథ. పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇద్దరు యువతుల మధ్య చిగురించిన స్నేహం ప్రేమకు దారితీసింది. ఆపై ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు హడావుడిగా సంబంధం కుదర్చి పెళ్లి చేశారు. వివాహమైతే చేశారు కానీ ప్రేయసి నుంచి ఆమె మనసును దూరం చేయలేకపోయారు. నెల రోజులకే ఆమె భర్తకు షాకిస్తూ ప్రియురాలితో కలిసి పరారైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలీపూర్ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి.. కూచ్బిహార్ జిల్లాలోని తుఫాన్గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత అది మరింత గాఢంగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు కుమార్తెకు అప్పటికప్పుడు సంబంధం కుదిర్చి వివాహం జరిపించారు. అక్కడితో సమస్య కొలిక్కి వస్తుందని భావించారు. అయితే, వారి ఆశలు ఫలించలేదు. పెళ్లయిన నెల రోజుల తర్వాత అంటే గత బుధవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేయసి వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మాల్దాలోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ప్రశ్నించినా వెనక్కి తగ్గలేదు. తాము మేజర్లమని, తమ సంబంధాన్ని అంగీకరిస్తేనే ఇంటికి వస్తామని, లేదంటే కోర్టుకెళ్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వారి తల్లిదండ్రుల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.