Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. దాదాపు 8గంటలకు పైగా ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు భోజన విరామ సమయం ఇచ్చారు. అనంతరం 5గంటలకు తిరిగి విచారణ కొనసాగించారు. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమచారం.
ఈ తరుణంలో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోదియా స్టేట్మెంట్ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్ పిళ్లైతో కలిపి కవితను విచారించారు. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం, హైదరాబాద్లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్, సిసోదియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. అభియోగాలపై కవిత నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్న ఈడీ అధికారులు ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.