Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.