Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంలగాణ - హైదరాబాద్
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ లో తొలి మూడు టెస్టుల్లోనూ స్పిన్నర్లు రాజ్యమేలారు. తొలి రెండు టెస్టుల్లో టీమిండియా నెగ్గగా, మూడో టెస్టులో ఆసీస్ గెలిచింది. ఈ మూడు టెస్టులు మూడ్రోజుల్లోపే ముగిశాయి. దాంతో భారత్ లోని పిచ్ లపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇవాళ ముగిసిన నాలుగో టెస్టు ఐదు రోజుల పాటు సాగినా ఫలితం రాలేదు. డ్రాగా ముగిసింది. దీనిపై టీమిండియా మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించారు. భారత పిచ్ లపై విమర్శలు చేసేవాళ్లు ఇప్పుడు సంతోషిస్తారనుకుంటా అని వ్యాఖ్యానించారు. మూడ్రోజుల్లో ముగిసినా... మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన పిచ్ లు గొప్పవా, ఐదు రోజుల పాటు మ్యాచ్ జరిగినా... ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని పిచ్ గొప్పదా...? అంటూ విమర్శకులను ప్రశ్నించారు. అహ్మదాబాద్ టెస్టుకు పనిచేసిన టెలివిజన్ కామెంటరీ బృందంలో రవిశాస్త్రి కూడా ఉన్నారు. ఆయన కామెంటరీ బాక్స్ నుంచే ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్ ల్లోనే ఎక్కువ వికెట్లు పడ్డాయని, ఐదు రోజుల పాటు జరిగిన టెస్టులో తక్కువ వికెట్లు పడ్డాయని వివరించారు. చర్చ జరగాల్సింది ఈ అంశంపైనే... ఎలాంటి పిచ్ కావాలో ఇప్పుడు చెప్పండి అని వ్యాఖ్యానించారు.