Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్ (ఓయూ పీజీఆర్ఆర్సీడీఈ) ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనున్నది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల అనుమతి ఇచ్చింది. ఓయూ అనుబంధంగా పీజీఆర్ఆర్సీడీఈ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి క్యాటగిరీ1 విద్యాసంస్థలు యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే దూర విద్య కోర్సులను నిర్వహించవచ్చు. ఓయూ క్యాటగిరీ1 విద్యా సంస్థ అయినా తమ నుంచి అనుమతి పొందాలని యూజీసీ లేఖ రాసింది. ఈ మేరకు ఓయూ అధికారులు 70 కోర్సులకు అనుమతి కోరుతూ యూజీసీకి దరఖాస్తు చేశారు. దీంతో యూజీసీ ఓయూతోపాటు క్యాటగిరీ 1 వర్సిటీల్లో కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రా వర్సిటీ, కురుక్షేత్రవర్సిటీల్లో 21 కోర్సుల చొప్పున అనుమతిని జారీచేసింది. ఓయూకు ఐదేండ్ల పాటు గుర్తింపునివ్వడం విశేషం.
కొత్త కోర్సులు
పీజీఆర్ఆర్సీడీఈలో మరో ఐదు కోర్సులు ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఒక పీజీ, ఒక డిగ్రీ కోర్సులుండగా, మరో మూడు కోర్సులకు రూపకల్పన చేస్తున్నారు. కొత్తగా ఈ ఏడాది పీజీ డిప్లొమా ఇన్ డాటాసైన్స్, వేదిక్ ఆస్ట్రాలజి డిప్లొమా కోర్సు, ఆంత్రోపెన్యూర్షిప్ డెవలప్మెంట్, యోగా సర్టిఫికెట్ కోర్సులు నడుస్తున్నాయి.