Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసక్తికరంగా సాగుతున్న ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో యూపీ వారియర్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసింది. ఇవాళ ముంబయి బ్రాబోర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఆష్లే గార్డనర్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేయగా... హేమలత 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు నమోదు చేసింది. వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, పర్శవి చోప్రా 2, అంజలి శ్రావణి 1, ఎక్సెల్ స్టోన్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి విజయభేరి మోగించింది. గ్రేస్ హ్యారిస్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేయగా... తహ్లియా మెక్ గ్రాత్ 38 బంతుల్లో 11 ఫోర్లతో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో సోఫీ ఎక్సెల్ స్టోన్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి యూపీ వారియర్స్ ను గెలుపు తీరాలకు చేర్చింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో కిమ్ గార్త్ 2 వికెట్లు తీయగా, మోనికా పటేల్ 1, ఆష్లే గార్డనర్ 1, తనూజా కన్వర్ 1, కెప్టెన్ స్నేహ్ రాణా 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ విజయంతో యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించింది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు చేరగా, యూపీ వారియర్స్ కూడా ఆ జట్ల సరసన నిలిచింది. ఇక ప్లే ఆఫ్స్ లో నాలుగో బెర్తు కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య పోటీ నెలకొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన చివరి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకుంటుంది. బెంగళూరు ఓడితే మాత్రం రన్ రేట్ కీలకమవుతుంది. బెంగళూరు, గుజరాత్ జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుంది.