Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఫిర్యాదు కోసం టీపీసీసీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఇప్పటి వరకు రాజ్భవన్ స్పందించలేదు. దీంతో గవర్నర్ జవాబు ఏం వస్తుందో అని టీపీసీసీ నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఉదయం 11 గంటలకు తమిళిసై పుదుచ్చేరి వెళ్తుండటంతో గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని పది మంది టీపీసీసీ నాయకులు ఈమెయిల్ ద్వారా అభ్యర్థించారు. అయితే ఇప్పటి వరకు రాజ్భవన్ నుంచి రిప్లై రాలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఈ లీకేజ్కు సంబంధించి మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఒకరోజు పాటు దీక్ష చేశారు. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గాంధారి మండలంలో దీక్ష చేశారు. దానికి కొనసాగింపుగా ఈరోజు గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పించాలని అపాయింట్మెంట్ కోరారు. కానీ ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ రాలేదు. గవర్నర్ అందుబాటులో ఉండటం లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నేతలకు గవర్నర్ అపాయింట్మెంట్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు.