Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పరీక్షలు బాగా రాయని ఓ బాలిక తల్లిందండ్రులు తనను తిట్టకుండా ఉండేందుకు తప్పుడు వేధింపుల కథ చెప్పింది. తల్లిదండ్రులతో పాటు పోలీసులు, మీడియాను బోల్తా కొట్టించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల బాలిక 10వ తరగతి పరీక్షలు సరిగ్గా రాయలేదు. విషయం తెలిస్తే తల్లిదండ్రుల తిట్ల నుంచి తప్పించుకునేందుకు బ్లేడుతో తనను తాను గాయపరచుకుని తప్పుడు కథనం చెప్పింది. ఈనెల 15న పాఠశాల ముగిసిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు తనను కొన్ని మీటర్ల దూరం తీసుకెళ్లి వేధించారని, గాయాలు చేశారని బాలిక పేర్కొంది. ఆమె తల్లిదండ్రలు ఫిర్యాదు మేరకు ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా పోలీస్ పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద లైంగికదాడి, కిడ్నాప్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చిన్నారి ఒంటరిగా తిరుగుతున్నట్లు గుర్తించారు. పోలీసులు చిన్నారికి కౌన్సెలింగ్ చేయగా, మార్చి 15న తనకు సోషల్ స్టడీస్ పరీక్ష ఉందని, అది సరిగా రాలేదని వెల్లడించింది. తల్లిదండ్రులు తిడతారని బాలిక చాలా భయపడిందని పోలీసులు తెలిపారు. దీంతో బ్లేడుతో తనను తాను గాయపరుచుకొని కిడ్నాప్ డ్రామా ఆడిందని తెలిపారు. బాలికను మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినట్టు బాలిక అంగీకరించడంతో కేసు రద్దు చేశారు.