Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు స్టేటస్ రీపోర్టను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో మూడు వారాలు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
'మొత్తం 6 ఎగ్జామ్స్ను రద్దు చేశారు. 5 లక్షల మంది వివిధ పరీక్షలకు అప్లై చేశారు. మూడున్నర లక్షల మంది సివిల్స్ రాశారు. 25 వేల మంది ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 18న ఐటీ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వాఖ్యలు చేశారు. ఇద్దరు మాత్రమే పేపర్ లీక్ చేశారు అని ఆయన ఎలా చెప్తారు? ఒక మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? పోలీస్ కాకుండా, సిట్ కాకుండా మినిస్టర్ ఎలా ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్తారు? ఒకే మండలం నుంచి 20 మంది టాప్ స్కొరర్లుగా ఉన్నారు. వెబ్సైట్లో ఎక్కడా అభ్యర్థుల మార్కులు పొందపరచలేదు. చాలా మందికి మార్కుల రూపంలో ఫేవర్ చేశారు.' అని పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్ వాదనలు విన్పించారు. 'ఈ కేసు విచారణను సిట్ పారదర్శకంగా చేస్తుంది. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిటిషన్ వేసిన వాళ్లకు ఈ ఎగ్జామ్ కాన్సిల్తో సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ వేశారు. పిటిషన్కు లోకస్ స్టాండ్ లేదు కాబట్టి పిటిషన్ను డిస్మిస్ చేయాలి. హైప్ కోసం ఇలాంటి పిటిషన్ లు వేయడం కామన్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సిట్ 9 మందిని అరెస్ట్ చేసింది. సిట్ కొన్ని మండలాలకు సైతం వెళ్లి విచారణ చేస్తుంది. 18 నుండి 23 వరకు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ డిమాండ్ మేరకే పరీక్షలు రద్దు చేశాం.' అని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.