Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మల్ జిల్లాలో పోలీసుల అరాచకం
- వేదికపైకి వచ్చి మైక్ కట్ చేసిన డీఎస్పీ
- ఆర్ఎస్ఎస్, బీజేపీకి పంత పాడిన పోలీసులు
- యాత్ర నాయకులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ నిర్మల్:
బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రపై పోలీసులు దాడి చేశారు. నిర్మల్ జిల్లాలో యాత్ర ప్రధాన ప్రచార కర్త పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతుండగానే నిర్మల్ జిల్లా డిఎస్పీ జీవన్ రెడ్డి వేదిక మీదకు దూసుకువచ్చారు. మైక్ కట్ చేయాలన్నారు. ఒక రాజకీయ పార్టీ వేదిక మీదకు దూసుకురావడమే కాకుండా వారించిన కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించారు. మైక్ వైర్లు లాగేశారు. లైట్లు ఆపేశారు. కరెంటు వైర్లను తెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై కేసులు పెడతామన్నారు.
`రాష్ట్ర డిజిపి పర్మీషన్ ఇచ్చిన తరువాత మీరెలా మా సభను ఆపుతారు? మా వేదిక మీదకు మీరెలా వస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పోలీసులంతా పని చేస్తున్నారా? మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు. నిర్మల్ పోలీసులు బిజెపి, ఆర్ఎస్ఎస్ లకు ముసుగుగా పని చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ దేశంలో బీజేపీ,ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తుంటే మీరు (నిర్మల్ పోలీసులు) బిజెపికి అనుకూలంగా పని చేస్తున్నారా?’ అని ఎస్.వీరయ్య, యాత్ర ప్రతినిధి బృందం అడివయ్య, స్కైలాబ్, ఆశయ్య, జయలక్ష్మీ, జగదీష్, లెల్లెల బాలకృష్ణ నిర్మల్ డీఎస్పీని వేదిక మీదనే నిలదీశారు. వీటికి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన డీఎస్పీ మళ్లీ సభను పునఃప్రారంభించగానే వేదిక వద్దకు దూసుకువచ్చి మళ్లీ అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించారు. సభికులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు.
ఈ సందర్భంగా ఎస్.వీరయ్య మాట్లాడుతూ 'సాయంత్రం అయిదు గంటల తరువాత సభ జరుపుకోమని స్థానిక జిల్లా కమిటీకి అనుమతినిచ్చారు. ఇప్పుడేమో ప్రభుత్వ ఆఫీసు పక్కనే ఉన్నందున కార్యకలాపాలకు ఆటంకం జరుగుతుందని సాకు చూపెట్టి బిజెపి, ఆర్ఎస్ఎస్ మూకలు పోలీసుల రూపంలో సభ మీద దాడి చేస్తున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం ఆయిదు తరువాత ప్రభుత్వ ఆఫీసులేవీ ఉండవని చెప్పింది పోలీసులే. అయిదు తరువాత సమావేశం జరుగుతుండగా అడ్డుకునేదీ వారే. నిర్మల్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఈ ఘటనను చూస్తే అర్థమైపోతుంది.’ అని అన్నారు.
`కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన అంశాలు ప్రారంభం కాగానే, వాటి గురించి ప్రజలను చైతన్యం చేసే మాటాలు నాలుగు మాట్లాడుతుండగానే పోలీసులకు లేని కర్తవ్యం గుర్తుకురావడం ఇందుకు నిదర్శనమ'ని అన్నారు. పోలీసులు మైక్ కట్ చేయడంతో, మైక్ లేకుండానే సభ కొనసాగింది. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మీ, అడివయ్య మాట్లాడుతూ 'మైక్ లేకపోతే గొంతుంది. మా గొంతును మీరు నొక్కలేర'న్నారు. ప్రజలందరూ 'అవును పోలీసులూ మీరు మా గొంతు నొక్కలేర'ని నినాదాలిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సభకు నిర్మల్ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గ నూతన కుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొమ్మెన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి, ఎస్.అరవింద్, ఎస్.శంభు, గంగమణి, యాత్ర రూట్ ఇన్చార్జ్ అనగంటి వెంకటేష్ ఈ సభలో పాల్గొన్నారు.