Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు. సిద్ధ రామయ్య.. వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కాగా, 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు. 2019లో జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులకే బీజేపీ కుట్రచేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా బీజేపీ రెబెల్స్ బెడదను ఎదుర్కొంటున్నది.