Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రశాసన్నగర్లో ఫ్లాట్ నంబరు 222లో నివసించే విశ్రాంత ఐపీఎస్ కొమ్మి ఆనందయ్య ఈనెల 16న భార్యతో కలిసి కాకినాడలో మున్సిపల్ కమిషనర్గా ఉన్న కుమారుడు రమేష్ ఇంటికి వెళ్లారు. శనివారం ఆనందయ్య ఇంటి వద్ద పనిచేస్తూ కింద సెల్లార్లో నివసించే డ్రైవర్ ఫోన్ చేసి ఇంట్లో చోరీ జరిగిందని తెలిపాడు. దీంతో ఆయన వచ్చి పరిశీలించగా, అల్మారాలో ఉంచిన 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 40వేల నగదు, 500 అమెరికన్ డాలర్లు, ఎనిమిది విలువైన చేతి గడియారాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఈ మేరకు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా, ఆగంతుకుడు శుక్రవారం అర్ధరాత్రి 1.15 ప్రాంతంలో ఆనందయ్య ఇంటి వెనుక నుంచి రెండో అంతస్తుకు వెళ్లాడు. వెళ్లి అక్కడ బోల్టు పెట్టిన ఉన్న తలుపు తన్ని, అది తెరచుకోవడంతో తొలుత వంటగదిలోకి వెళ్లాడు. కొన్ని వెండి వస్తువులను సంచిలో వేసుకున్నాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి బీరువా తాళం లేకుండానే తెరిచాడు. లాకర్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, డాలర్లు, చేతిగడియారాలను తీసుకున్నాడు. దాదాపు గంటపాటు ఇంట్లోనే గడిపాడు. బయటకు వచ్చి లిఫ్ట్ అడిగి బాటా కూడలి వరకు, అక్కడ నుంచి సీవీఆర్ కూడలి చేరుకున్నాడు. అక్కడ ఇంకో వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. ముందుగా రెక్కీ చేసి చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.