Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఎయిరిండియా విమానం, నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం గగనతలంలో పరస్పరం ఢీకొనే ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఎయిరిండియా విమాన పైలెట్లు వెంటనే తమ విమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంతో ముప్పు తప్పింది.
ఢిల్లీ నుంచి నేపాల్ చేరుకున్న ఎయిరిండియా ఎయిర్ బస్ -319 విమానానికి ఖాట్మండూ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు క్లియరెన్స్ ఇచ్చారు. దాంతో ఎయిరిండియా విమాన పైలెట్లు 19 వేల అడుగుల ఎత్తు నుంచి 15 వేల అడుగులకు ఆల్టిట్యూడ్ ను తగ్గించారు. అయితే కౌలాలంపూర్ నుంచి నేపాల్ చేరుకున్న విమానం కూడా ల్యాండ్ అయ్యేందుకు అదే ఎత్తులో వస్తోంది. ఈ తరుణంలో దీన్ని గమనించిన ఎయిరిండియా పైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. ఆ సమయంలో రెండు విమానాల్లోనూ 200 మంది ప్రయాణికుల వరకు ఉన్నారు. అయితే ఈ ఘటనకు బాధ్యులుగా ఖాట్మండూ ఎయిర్ పోర్టులో ముగ్గురు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను సస్పెండ్ చేశారు. అంతేకాదు, ఘటనపై విచారణ నిమిత్తం ఎయిరిండియా విమాన పైలెట్లను, నేపాల్ ఎయిర్ లైన్స్ విమాన పైలెట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించారు.