Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్ గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ పంపారు. మరోవైపు.. ఆయన సతీమణి విజయలక్ష్మి కూడా మరో లేఖను విడుదల చేశారు. మొదట్నుంచీ కాంగ్రెస్ వాది అయిన డీఎస్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా టీఆర్ఎస్ తీర్థమే పుచ్చుకున్నారు. ధర్మపురి అరవింద్ మాత్రం మొదట్నుంచీ బీజేపీలో ఉంటూ వస్తున్నారు. ఇలా తండ్రి ఒక పార్టీలో.. కుమారుడు మరో పార్టీలో ఉంటూ వస్తున్నారు. ఇలా చాలా రోజులు డీఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు నడుస్తోంది. ఆ మధ్య రెండు, మూడేళ్ల పాటు డీఎస్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు డీఎస్.
వాస్తవానికి డీఎస్ చాలా రోజులు కాంగ్రెస్లో చేరుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి డీఎస్ చేరికకు అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఆయన తనయుడు ధర్మపురి సంజయ్ చేరిక ప్రతిపాదనపైన నిజామాబాద్ కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో డీఎస్ చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న డీఎస్.. గాంధీభవన్కు వీల్ చెయిర్లోనే వచ్చారు. తన కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తు, తన ఎదుగుదలకు దోహదపడిన కాంగ్రెస్ లోనే చివరి వరకు కొనసాగాలన్న ఆకాంక్షతో మార్చి 26న పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావ్ ఠాక్రే, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. దీంతో 24 గంటల్లోనే ఏం జరిగిందో అని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్కే నడుస్తోంది.