Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువళ్లూర్
స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా తల్లిదండ్రులు వచ్చి చదువుకోమని హెచ్చరించడంతో తొమ్మిదేళ్ల చిన్నారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడులోని తిరువళ్లూర్కు చెందిన చిన్నారి ప్రతిక్ష నాలుగో తరగతి చదువుతోంది. ఇన్స్టాగ్రాంలో రీల్స్ చేస్తూ సరదాగా గడిపే తనని ఇరుగుపొరుగు వారు, స్నేహితులు ‘రీల్స్క్వీన్’ అని పిలుస్తుంటారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బంధువుల ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా తల్లిదండ్రులు కృష్ణమూర్తి, కర్పగం చిన్నారిని ఇంటికి వెళ్లి చదువుకోమని హెచ్చరించారు.
చిన్నారికి తాళాలు ఇచ్చి వారు మార్కెట్కు వెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన చిన్నారి కిటికీ చువ్వకు తువ్వాలుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాదాపు గంట తర్వాత తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించారు. తలుపును తీయమని కుమార్తెను కోరగా తను ఎంతకీ స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఆచేతన స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి బిత్తరపోయారు. దీంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆలస్యమవడంతో చిన్నారి మృతి చెందింది. కేసు నమోదు చేసిన తిరువళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.