Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మూడేళ్ల కిందట పంజాబ్ లోని థరియాల్ గ్రామంలో టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు దోపిడీ దొంగల దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీఎస్ఎఫ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న రైనా మామ అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, దొంగలు దాడి చేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాంతో అశోక్ కుమార్ అక్కడిక్కడే మరణించగా, ఆయన భార్య, కుమారులు ఆస్పత్రి పాలయ్యారు. కుమారుడు కౌశల్ చికిత్స పొందుతూ మరణించగా, భార్య, మరో కుమారుడు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రషీద్ ను పోలీసులు మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించారు. గత మూడేళ్లుగా అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీసులు రషీద్ ను ఓ ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. రషీద్ పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఓ పోలీసు అధికారి చేతికి గాయమైనట్టు తెలిపారు.