Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
బెంగుళూరు నుంచి బెజవాడ వచ్చిన కిలో ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అనంతపురం డిపో బస్ ద్వారా డ్రగ్స్ బస్టాండ్ చేరుకున్నట్లు గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ వైవీఎస్ రావుకి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బెజవాడలో అందజేయాలని ఓ ఆగంతకుడు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. బస్సు విజయవాడ చేరుకున్న తర్వాత అర్ధరాత్రి డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్లో ఉన్న బట్టల్లో ఓ ప్యాంటు నడుము చుట్టూ ఉన్న ఓ అంగుళం మందం పట్టీలో నిందితులు డ్రగ్స్ను పెట్టి కుట్టేశారు. ప్యాంట్లో కుట్టిన భాగాన్ని చించి డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు విచారించారు. బెంగళూరులోని కెంపెగౌడ బస్స్టేషన్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు బెజవాడ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్యాగ్లో బట్టలు ఉన్నాయని, విజయవాడలో తన స్నేహితుడు వచ్చి తీసుకుంటాడని, అతని ఫోన్నంబరు డ్రైవర్కు ఇచ్చాడు. విజయవాడ వచ్చాక, రాత్రి 10.30కు బస్సును గ్యారేజీలో పెట్టి బయటకు వస్తుండగా ఓ యువకుడు వచ్చి బ్యాగ్ను తీసుకున్నాడు. అదే సమయంలో టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు డ్రైవర్ను, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగ్ తనిఖీ చేయగా.. ఓ ప్యాంటులో ఎండీఎంఏ డ్రగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ గతంలో ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చేవారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పార్సిల్ను తీసుకునేందుకు వచ్చిన యువకుడు ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు, ఎవరెవరికి చేరుతోందన్న అంశాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది.