Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లిన వృద్ధుడు మెట్లెక్కుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన బాపట్ల జిల్లా నగరం మండలంలో గురువారం చోటు చేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. పింఛను ఇచ్చేందుకు గ్రామ వాలంటీరు ఇంటికి రాకపోవడంతో విసుగు చెందిన వృద్ధుడు.. అద్దంకివారిపాలేనికి చెందిన కేసన మస్తాన్రావు (78) సచివాలయానికి వెళ్లారు. వేలిముద్రలను యంత్రం తీసుకోవడం లేదని, ధ్రువపత్రాలతో రావాలని అక్కడి అధికారులు ఆయనకు సూచించారు. అలా ఒకటికి మూడు సార్లు ఇంటికి, కార్యాలయానికి తిరిగిన వృద్ధుడు సచివాలయం మెట్లెక్కుతూ కుప్పకూలారు. అధికారులు 108కి సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని కుమారుడు వెంకటేశ్వరరావు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.