Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ, కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 1,801 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఇక ఢిల్లీలో కొత్తగా 535 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,13,938కు చేరింది. ఇందులో 26,536 మంది మృతిచెందారు. పాజిటివిటీ రేటు 23.05 శాతానికి పెరిగింది. జ్వరం, దగ్గు, ఒంటినొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు. వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోవడంతో నిబంధనలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. అయితే, ఇన్ఫ్లుఎంజా సబ్ టైప్ హెచ్3ఎన్2 కారణంగా ఇన్ఫ్లుఎంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. H3N2 వైరస్ సోకితే ముక్కు కారటం, నిరంతర దగ్గు మరియు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఇన్ఫ్లుయెంజా కారణంగా ఆసుప్రతుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పింది.