Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో జాతీయ పార్టీల నేతల నుంచి ఊహించని కామెంట్లు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గెహ్లాట్ తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు. రాజస్థాన్ నుంచి తొలి వందే భారత్ రైలును ఈరోజు మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించిన మోడీ... అనంతరం ప్రసంగిస్తూ గెహ్లాట్ ను కొనియాడారు. తన ప్రసంగంలో సీఎం గెహ్లాట్ కేంద్రాన్ని కోరుతున్న కొన్ని డిమాండ్లను ప్రస్తావించిన ప్రధాని... కాంగ్రెస్ లో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలను సైతం ప్రస్తావించారు. గెహ్లాట్ తన సొంత పార్టీలోనే సమస్యలను ఎదుర్కొంటున్నారని మోడీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను సైతం పక్కన పెట్టి గెహ్లాట్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని... ఈనాటి వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సైతం హాజరయ్యారని కితాబిచ్చారు. గెహ్లాట్ కు తాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.