Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సిట్ విచారణపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. 'టీఎస్పీఎస్సీలో లీక్ అయినవి 15 పేపర్లు, రద్దు అయినవి 6 పరీక్షలు, రోడ్డున పడ్డది 10లక్షల మంది నిరుద్యోగులు. 'కీలక నిందితులు' అని తేల్చింది ఇద్దరిని మాత్రమే. ఇదీ చిన్న దొర ఆధ్వర్యంలో నడిచిన సిట్ రిపోర్టు' అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులాగే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణాన్ని సిట్ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒక్క పేపర్ లీక్ అయితే బయటికి పొక్కే విషయం, 15 పేపర్లు లీక్ అయ్యేదాకా బయటకు రాలేదంటే ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదంటారా? అని ప్రశ్నించారు. సర్వర్ నుంచి పేపర్స్ లీక్ అయ్యాయంటే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రమేయం లేదంటారా? అని నిలదీశారు. ఇంత జరిగినా బోర్డును ప్రక్షాళన చేయలేదంటే ఇంకా కొలువులు అమ్ముకునే ఉద్దేశం తమకుందా అంటూ వైఎస్సార్టీపీ చీఫ్ మండిపడ్డారు.
'మీరు నిర్దోషులైతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నట్లు?. నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారా?' అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సిగ్గురాని ఈ ప్రభుత్వానికి.. నిరుద్యోగుల గోస పట్టదన్నారు. నిరుద్యోగుల కోసమే టీ - సేవ్ ఏర్పడిందని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా పార్టీలకు అతీతంగా టీ - సేవ్ పోరాడుతుందన్నారు. ఇందులో నిరుద్యోగులు, విద్యార్థులు కూడా భాగస్వాములై ఈ నెల 17న ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి, ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.