Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పంజాబ్
పంజాబ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. హోషియార్పుర్ జిల్లా గర్శంకర్ ప్రాంతంలో కాలినడకన వెళ్తున్న యాత్రికులను ఓ గుర్తుతెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బైశాఖీ పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 50 మంది భక్తులు చరణ్ ఛో గంగా వైపు నడుచుకుంటూ వెళ్తున్నారని.. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని లారీ వారిని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగందని డీఎస్పీ దల్జిత్ సింగ్ ఖాఖ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన అన్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని.. వీరంతా ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందినవారిగా గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వడం వల్ల అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.మరోవైపు ఇదే రోజు గర్శంకర్ ప్రాంతంలోనే గర్హి మనోస్వాల్ సమీపంలో ట్రాక్టర్లో వెళ్తున్న మరో భక్తుల బృందం కూడా ప్రమాదానికి గురయింది. రోడ్డుపై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది వాహనం. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడవగా.. మరో 10 మంది గాయపడ్డారు. వీరు కూడా బైశాఖీ పండుగా సందర్భంగా గర్శంకర్ సబ్ డివిజన్లోని శ్రీ ఖురల్గర్ సాహిబ్లో లంగర్ ఏర్పాటు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.