Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఆదేశించింది. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. బీబీసీ ఇండియా కార్యాలయంలో కొద్ది నెలల క్రితం ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు నిర్వహించిన ఆ తనిఖీలను.. ‘సోదాలు కాదు.. సర్వే’ అని అధికారులు పేర్కొన్నారు. అయితే, గోద్రా మారణకాండ వెనక నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రమేయం ఉందంటూ బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ తనిఖీలు చోటుచేసుకోవడం గమనార్హం.
గుజరాత్ అల్లర్లలో మోడీ హస్తం ఉందని ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోడీకి క్లీన్చిట్ లభించాక ఇలా అభాండాలు వేయడమేమిటని బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించిన లింకుల్ని కేంద్రం సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది.