Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు ప్రైవేటు వైద్యుల గుర్తింపును రాష్ట్ర వైద్య మండలి రద్దు చేసింది. కరణ్ ఎం.పాటిల్ అనే వైద్యుడి గుర్తింపును 6 నెలల పాటు, సీహెచ్.శ్రీకాంత్ అనే మరో వైద్యుడి గుర్తింపును 3 నెలల పాటు రద్దుచేస్తూ తెలంగాణ రాష్ట్ర వైద్యమండలి ఛైర్మన్ వి.రాజలింగం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గుర్తింపు రద్దయిన ఇద్దరు వైద్యులు తమ సర్టిఫికెట్లను రాష్ట్ర వైద్యమండలికి అందజేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం.పాటిల్ అనే ఆర్థోపెడిషియన్.. ఓ రోగికి ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా కుడి కాలికి చేశారు. ఈ తప్పిదాన్ని రెండు రోజుల అనంతరం గుర్తించి తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేశారు. దీనిపై బాధితులు డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి వైద్యుడి తప్పిదాన్ని నిర్ధరించారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డెంగ్యూతో ఆసుపత్రిలో చేరగా వైద్యుడు సీహెచ్.శ్రీకాంత్ అతన్ని సకాలంలో మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సిఫారసు చేయలేదు. దీంతో రోగి మృతి చెందారు. బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి వైద్యుడి నిర్లక్ష్యాన్ని నిర్ధరించారు. కలెక్టర్ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర వైద్యమండలి విచారణ చేసి శ్రీకాంత్ గుర్తింపును రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గుర్తింపు రద్దుపై 60 రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు ఇద్దరు వైద్యులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.