Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీలంక
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక తాజాగా వెల్లడించింది. టోక్ మకాక్ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర తమ శాఖ అధికారులను ఆదేశించారు.
చైనాలోని వెయ్యి జంతు ప్రదర్శనశాలకు డ్రాగన్ దేశం లక్ష కోతులను కోరినట్లు మంత్రి మహింద అమరవీర తెలిపారు. తమ దేశంలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉన్నందున.. డ్రాగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు క్యాబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ‘టోక్ మకాక్’ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా. ఇవి స్థానికంగా పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని, ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వాటిని ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని ఉచితంగా ఇస్తారా..? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా..? అన్న విషయంపై క్లారిటీ లేదు.