Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో: ఒక ట్రాక్టర్ ట్రాలీ వంతెన పైనుంచి కింద ఉన్న నదిలో పడింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తిల్హర్ పరిధిలోని బిర్సింగ్పూర్ గ్రామంలో ఉన్న గర్రా నదిపై ఉన్న వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, అజ్మత్పూర్ గ్రామానికి చెందిన ప్రజలు ‘భగవత్ కథ’ కోసం గర్రా నది నుండి నీటిని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ ట్రాలీలో వచ్చారని రూరల్ ఏఎస్పీ సంజీవ్ బాజ్పాయ్ తెలిపారు. వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిన సమయంలో అందులో సుమారు 30 మంది జనం ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు, సత్వర వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.