Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్: భూ వివాదం కారణంగా రైతు కరెంట్ స్తంభం ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి అతడిని కిందకు దించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సేవాలాల్ తండాలో చోటుచేసుకుంది. సేవాలాల్ తండాకు చెందిన దారంసోత్ రవి, దారంసోత్ బాలరాజు అన్నదమ్ములు. రవి తండ్రి హర్యానాయక్ పేరు మీద ఉన్న కొంత భూమిని బాలరాజు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. అయితే ఈ భూమి యాజమాన్య హక్కుల విషయంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పంచాయతీకి పిలిచినా సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం ఆ భూమిలో వేసిన వరి పంటను కోసేందుకు రవి ప్రయత్నించగా బాలరాజు అడ్డుకున్నాడు. పంచాయతీ తేల్చే వరకు వరికోత లేదన్నారు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వెళ్లింది. భూమి తనకు దక్కటం లేదని బాలరాజు తీవ్ర మనస్థాపం చెందాడు. స్థానికులు వద్దని చెప్పిన మాట వినకుండా స్తంభం ఎక్కాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సబ్ స్టేషన్కు ఫోన్ చేసి సరఫరా నిలిపివేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా దిగి రాకపోవడంతో ఓ కానిస్టేబుల్ నీకు దండం పెడతా దిగన్నా.. నీ పిల్లలు ఆగమైతరు అని పదే పదే ప్రాధేయపడటంతో బాలరాజు కిందకు దిగి వచ్చాడు. కిందికి దిగిన బాలరాజు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు వెల్లడించారు.