Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు మరియు హస్టల్స్లో సుమారు 3,070 మంది డైలీవేజ్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైమ్ తదితర పేర్లతో గత 35యేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న దినసరి వేతన కార్మికులను (డైలీవేజ్ వర్కర్స్) పర్మినెంట్ చేయాలని దాని కోసం విద్యార్థుల సంఖ్యకనుగుణంగా పోస్టులను శాంక్షన్ చేసి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మరియు డైలీవేజ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డైలీవేజ్, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ నిమిత్తం జీ.ఓ.ఎం.ఎస్.నెం.16 తేది:26-02-2016ను విడుదల చేసింది. హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ కూడా జీ.ఓ.నెం.16 గైడ్లైన్స్ ప్రకారం గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ది:26-04-2017న తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తేది:15-09-2017న నాటి గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ మెమో నెం.సి2/1846/2016 (సూచిక-3)ను ఇచ్చారు. దీనిలో తేది: 26-02-2016 నాటికి 10 సం||లు సర్వీస్ పూర్తిచేసిన వారి రెగ్యులరైజేషన్ కొరకు వివరాలు అందించాలని కోరియున్నారు. అయితే నేటికి ఈ సర్క్యులర్ అమలుకు నోచుకోలేదు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకనుగుణంగా నూతన పోస్టులను శాంక్షన్ చేయడం లేదు. దీంతో అవసరాన్ని బట్టి విద్యార్థుల సంఖ్యకనుగుణంగా డైలీవేజ్, ఔట్సోర్సింగ్ పేరుతో వర్కర్స్ను నియమించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నానని జూలకంటి రంగారెడ్డి అన్నారు.
డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల సంఖ్యకనుగుణంగా అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదు. ఫలితంగా నెలలు, సంవత్సరాల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. వీరికి గత 35యేళ్ళుగా జిల్లా కలెక్టర్ల గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు. కానీ ఇటీవల కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గెజిట్లను అమలు చేయడం లేదు. లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ పూర్తి వేతనం చెల్లించాలని జీఓ నెం.45ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీఓను అమలుచేసి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ చెల్లించాలని కోరుతున్నాము. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు రోజుకి 16 గంటలు శ్రమ చేస్తూ గిరిజన విద్యాభివద్ది కోసం కృషి చేస్తున్న వీరికి కనీస వేతనాలు ఇవ్వటం లేదు. జిల్లాకొకరకంగా వేతనాలు చెల్లిస్తున్నారు. అవికూడా సక్రమంగా ఇవ్వడం లేదు. పార్ట్టైమ్ పేరుతో తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారు. నిత్యం నిప్పుల దగ్గర వంట చేస్తూ అనారోగ్యాల పాలవుతున్నా పిఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద భీమా వంటి సౌకర్యాలు కల్పించటం లేదు. సరైన జాబ్ చార్ట్ లేదు. విపరీతమైన పనిభారం ఉంటుంది. కావున గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ Ê ఔట్సోర్సింగ్ వర్కర్స్కు పర్మినెంట్ చేయుట, పెండింగ్, లాక్డౌన్ కాలంలో వేతనాలు వెంటనే చెల్లించాలని, వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జూలకంటి రంగారెడ్డి కోరారు.