Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు ప్రముఖ నివేదిక తెలిపింది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్లో 'అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరగడం విశేషం. ఈ జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ తొలి స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి ఈ మహా నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ వెల్లడించింది. 'ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023'ను మంగళవారం ఈ కంపెనీ విడుదల చేసింది. మొత్తం 97 పట్టణాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జపాన్ రాజధాని టోక్యో 2,90,300 మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. 2,85,000 మందితో శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా మూడో స్థానంలో ఉంది. లండన్ (2,58,000), సింగపూర్ (2,40,100), లాస్ ఏంజెల్స్ (2,05,400), హాంకాంగ్ (1,29,500), బీజింగ్ (1,28,000), షాంఘై (1,27,200), సిడ్నీ (1,26,900) తొలి పది నగరాల జాబితాలో ఉన్నాయి. భారత్ నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానం దక్కించుకొంది. తర్వాత దిల్లీ 30,200 మిలియనీర్లతో 36వ స్థానంలో, బెంగళూరు 12,600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలో, కోల్కతా 12,100 మందితో 63వ స్థానంలో, హైదరాబాద్ 11,100 మందితో 65వ స్థానంలో ఉన్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియాసియా, సీఐఎస్, తూర్పు ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా ఇలా వివిధ ప్రాంతాలుగా విభజించి హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంపన్న నగరాల జాబితాను రూపొందించింది. అమెరికా నుంచి అత్యధిక నగరాలు దీనిలో చోటు దక్కించుకున్నాయి. 2000లో ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్న లండన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం.