Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.
జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023’ పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది. భారత్లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్నార్ తెలిపారు. అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.