Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం స్థానిక ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించింది.
కొన్ని నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాలు ఏర్పాటై ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పాల్వంచ మండల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ తరుణంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని 9 గ్రామాలు, రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని కొత్తగా పాల్వంచ మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో 10 గ్రామాలతో పాల్వంచ మండలం ఏర్పడింది. తాజా మండలంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది. దీంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం నుంచి తొమ్మిది గ్రామాలను విడదీసి ఎర్రవల్లి పేరుతో కొత్త మండలం ఏర్పాటైంది.