Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్లో ఈసారి నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్లోని భాషేతర సబ్జెక్టులకు ...అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్లో స్కోర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.