Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లోని సనత్నగర్లో దారుణం చోటుచేసుకున్నది. ఎనిమిదేండ్ల వయస్సున్న అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం సనత్నగర్లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. అమావాస్య కావడంతో బాలుడిని నరబలి ఇచ్చారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అదే ప్రాంతంలో ఉంటున్న హిజ్రా.. బాలుడిని నరబలి ఇచ్చాడని ఆరోపిస్తూ అతని ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం తప్పిపోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి 8.30 గంటలకు బకెట్లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికిచేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు.