Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
గుజరాత్ లో 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్లకుపైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారనే దాన్ని ఆధారంగా చేసుకుని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఎనిమిది మంది ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. నేరంలో కీలక పాత్ర దృష్ట్యా మరో నలుగురు దోషుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఈ నలుగురికి ట్రయల్ కోర్టు తొలుత మరణ శిక్ష విధించగా తదనంతరం గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది.
2002 ఫిబ్రవరిలో గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో ఓ రైలుకు నిప్పంటించిన ఘటనలో దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్లో పెద్దఎత్తున అల్లర్లకు దారితీసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2011లో 11 మంది దోషులకు మరణ శిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. తదనంతరం గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే, 11 మంది మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దోషులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.