Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో 'ఈద్ ఉల్ ఫితర్' పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం కోరుకున్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి వుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధితో పాటు పలు రంగాల్లో ఆసరానందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు భరోసాగా నిలిచిందన్నారు. వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. స్వయం పాలనలో గడచిన తొమ్మిదేండ్ల కాలంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాఫ్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు.మైనారిటీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ ఉద్ఘాటించారు.