Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను అధికారులు మార్చి 19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ను సందర్శించారు. గతేడాది సుమారు 3.62 లక్షమంది తులిప్ పూలను చూశారు. కాగా, ఈ ఏడాది గార్డెన్ను సందర్శించిన పర్యాటకుల్లో 3 లక్షలకుపైగా పర్యాటకులు జమ్ముకశ్మీర్ వెలుపల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరిలో 3125 మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసించే సీజన్లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్ను తెరుస్తుంటారు. ఈ ఏడాది మార్చి 19 నుంచి గార్డెన్లోకి సందర్శకులను అనుమతించారు. ఏప్రిల్ 20న మూసివేశారు. ఈ పూదోటలో ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి. అయితే శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్లలో విస్తరించి ఉంది.