Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రయివేటీకరణ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తానే కొనుగోలు చేస్తానని చెప్పారు. ఇందుకోసం రూ.42 వేల కోట్లతో బిడ్ వేస్తానని, పదిహేను రోజుల్లో రూ.4 వేల కోట్లు ఇస్తానని పేర్కొన్నారు. అనకాపల్లిలో ఉంటున్న తండ్రి బర్నబాస్ ను కలిసిన కేఏ పాల్.. స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తే తానే కొంటానని చెప్పారు. వేలంలో పాల్గొనడానికి అవసరమైన పేపర్ల కోసం అధికారులను సంప్రదిస్తున్నట్లు వివరించారు.
సుమారు రూ.3.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం రూ.3,500 కోట్లకు అమ్మేయాలని చూస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని అందరమూ కలిసి ఫ్యాక్టరీని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వైసీపీ, టీడీపీ, సీపీఐ నేతలను కలిసి చర్చలు జరుపుతానని ఆయన వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రజాశాంతి పార్టీతో పనిచేసేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత జగన్ ప్రభుత్వం.. రెండూ కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని కేఏ పాల్ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారేలా చేశారని విమర్శించారు. లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. తనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఏడాదిలో పూర్తిచేస్తానని కేఏ పాల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.