Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు. రాహుల్ గాంధీపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్సభ స్పీకర్.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం జారీచేయడం అంతా వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో మోడీ, అదానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకిచూపించి రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేసి అధికారిక నివాసం ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు. ఆయన తాత ముత్తాతలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని, జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ఆయన ముత్తాత మోతిలాల్ నెహ్రూ అలహాబాద్, ఢిల్లీల్లో ఖరీదైన భవనాలను దేశం కోసం ఇచ్చేశారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ సైతం అనేక త్యాగాలు చేశారని, రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీపై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ పాపం ఊరికే పోదని దేశ ప్రజలు మరిచిపోరని, అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం గమనిస్తున్నారని బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.