Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్పై భారత రెజ్లర్లు మరోసారి ధ్వజమెత్తారు. మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ వినేష్ ఫోగత్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లాంటి రెజర్లు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిరసన ప్రదర్శనకు కూర్చున్నారు. గత జనవరిలో కూడా వీరంతా ఇదే చోట కొన్ని రోజులపాటు ధర్నా చేశారు.
ఇటీవలే కొంతమంది మహిళా రెజ్లర్లు తమను బ్రిజ్భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఇంకా దాఖలు చేయలేదని రెజ్లర్లు పేర్కొన్నారు.
ఈ విషయం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రెజ్లర్ సాక్షి మాలిక్.. జంతర్ మంతర్ వేదికగా తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ ప్యానెల్ నివేదికను ఇంకా బహిరంగపరచకపోవడం తమను నిరాశకు గురిచేస్తోందని అన్నారు."మహిళా రెజ్లర్లు ఇచ్చిన రికార్డెడ్ స్టేట్మెంట్ నివేదికను పబ్లిక్గా ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ఇది సున్నితమైన సమస్య, కంప్లైంట్ ఇచ్చినవారిలో ఒకరు మైనర్ బాలిక" అని ఆమె అన్నారు. అంతే కాకుండా ఫిర్యాదుదారుల పేర్లను లీక్ చేయకూడదని కోరారు. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని బజరంగ్ పునియా అన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరోపణలు చేసి 3 నెలలకుపైనే గడిచినా ఇంత వరకు న్యాయం జరగలేదని.. ఎంత ప్రయత్నించినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని రెజ్లర్ వినేశ్ ఫోగట్ అన్నారు. "మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే పడుకుని భోజనం చేస్తాం. మూడు నెలలుగా సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము దేశం కోసం పతకాలు సాధించాము. దీని కోసం మా కెరీర్ను పణంగా పెట్టాము" అని వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.